ఊహించని స్థాయిలో నగరాలు, పట్టణాలు రూపురేఖలు మార్చుకుంటున్నాయి. అభివృద్ధితో పాటు అదే స్థాయిలో కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గాలి, నీరు, ఆహారం… అన్నీ కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. అయితే మరోవైపు మేధావులు, శాస్త్రవేత్తలు, ఆయా రంగాల్లోని నిపుణులు ఎప్పటికప్పుడు శాస్త్రీయ సూచనలు చేస్తూనే ఉన్నారు.

మనదేశంలో పల్లెల నుంచి నగరాలకు వలసలు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో నగరాలు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. ఊపిరాడని పరిస్థితి, ఊపిరి తీసుకోలేని దుస్థితి… ముఖ్యంగా వాయుకాలుష్యం నగరవాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ శీతాకాలం వస్తోందంటే గజగజ వణికిపోతోంది. కారణం… గాలి నాణ్యతలు చలికాలంలో ఒక్కసారిగా పడిపోయి శ్వాస తీసుకునేందుకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఊపిరితిత్తులకు స్వచ్ఛమైన గాలి అందట్లేదు. బయటికి కనిపించకపోయినప్పటికీ దీనికి ప్రధానంగా నాలుగు అంశాలున్నాయి.
అవి రవాణా, పరిశ్రమలు, చెత్త, నిర్మాణ రంగంలోని కూల్చివేతల వృథా. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లతో పాటు చాలా నగరాల్లో వీటివల్ల ఉత్పన్నమవుతున్న అనేక సమస్యలు పర్యావరణవేత్తలకు సరికొత్త సవాళ్లను విసురుతున్నాయి. అదేవిధంగా పరిస్థితులను బట్టి కొన్ని నగరాలు పరిష్కార మార్గాలను కూడా అన్వేషించి, ఆచరించి చక్కటి ఫలితాలను అందుకుంటున్నాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించి ‘సీఎస్ఈ’ ఆ అనుభవ పాఠాలను ‘డ్రైవింగ్ క్లీన్ ఎయిర్ యాక్షన్ అండర్ ఎన్క్యాప్’ పేరిట ఒక పుస్తకాన్ని ప్రచురించింది. అందులో అనేక అంశాలను పరిశోధకులు శాస్ర్త్రీయంగా చర్చించి, పలు సూచనలు చేశారు. ‘స్వచ్ఛభారత్ మిషన్ 2.0’ (అర్బన్)లో భాగంగా ‘ఎన్క్యాప్’ ఆయా నగరాలకు వివిధ రకాలుగా సహకారాన్ని అందిస్తోంది.

ఉదాహరణకు 15వ ఫైనాన్స్ కమిషన్లో భాగంగా పది లక్షల జనాభా ఉన్న 42 నగరాలకు నేరుగా ఫండింగ్ చేస్తోంది. దీన్నే ‘మిలియన్ ప్లస్ సిటీస్ ఛాలెంజ్ ఫండ్’గా పిలుస్తున్నారు. దీంతోపాటు కొన్ని సలహాలు, సూచనలనూ ఎప్పటికప్పుడు అందిస్తోంది. ఇప్పటిదాకా కొన్ని నగరాలు శ్వాసించేందుకు చేస్తున్న ప్రయత్నాలివి.ఢిల్లీ ఇప్పటికే ప్రజా రవాణా వాహనాల్లో, స్థానిక రవాణా వాహనాల్లో డీజిల్కు బదులు సీఎన్జీని అందుబాటులోకి తెచ్చింది. నగరం బయటి నుంచి వచ్చే డీజిల్ వాహనాలపై కాలుష్య ట్యాక్స్లు విధిస్తోంది. పదేళ్ల కాలపరిమితి ఉన్న డీజిల్, పదిహేనేళ్ల కాలపరిమితి ఉన్న పెట్రోల్ వాహనాలను ఫేజవుట్ చేస్తోంది. బొగ్గు ఆధారిత ప్లాంట్లను మూసేసింది. లోకల్గా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెడుతోంది. అయినప్పటికీ నేషనల్ ఎయిర్ క్లీన్ ఎయిర్ స్టాండర్డ్స్ అందుకోవాలంటే పీఎం2.5 స్థాయిలను మరో 60 శాతం తగ్గించుకోవాల్సిందే.-

వారణాసి నగర నిర్మాణంలో భాగంగా నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం వల్ల కాలుష్యం తగ్గింది కొచ్చిలో భూమిపై నిర్మించిన మెట్రోతో పాటు ఎలక్ట్రిక్ వాటర్ మెట్రో ఫెర్రీ లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే ఎలక్ట్రిక్ బస్సులు, ఈ రిక్షాలు కూడా వాయు కాలుష్యాన్ని తగ్గిస్తున్నాయి. వీటికోసం సోలార్ ఎనర్జీని ఉపయోగించుకోవడం విశేషం.- శ్రీనగర్లో జీలమ్ రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేశారు. ఎలక్ట్రిక్ బోట్ సర్వీస్లను ప్రవేశపెట్టారు. అదేవిధంగా పాదచారుల కోసం చక్కని ఫుట్పాత్లు, రోడ్ల పక్కన పబ్లిక్ స్పేస్ పెంచారు. 16 రూట్లలో 100 బ్యాటరీ బస్సులను నడుపుతున్నారు.- చెన్నైలో నాన్ మోటరైజ్ ట్రాన్స్పోర్ట్ (ఎన్ఎంటీ)కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని 100 కిలోమీటర్ల పొడవు వీధులను సుందరమైన కాలిబాటలుగా అభివృద్ధి చేశారు.గురుగ్రామ్లో సైకిల్ ట్రాక్లు, కియోస్కోలు ఏర్పాటుచేశారు.- సూరత్లో ‘ఇంటెలిజెంట్ ట్రాన్పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్’ (ఐటీఎంఎస్), ‘ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్’ (ఎఎఫ్సీ), ‘సూరత్ మనీ కార్డ్’ను ప్రవేశపెట్టిన తర్వాత అందరూ బస్సుల్లో ప్రయాణించేందుకు మొగ్గుచూపుతున్నారు.- ఇండోర్, పుణే, భోపాల్, బెంగళూరు, సూరత్, వెంగుర్లలో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా కాలుష్యానికి చెక్ పెడుతున్నారు.- నగరాల్లో భవన నిర్మాణం, కూల్చివేతల వల్ల అత్యధిక దుమ్ముధూళి ఉత్పన్నమవు తోంది. ఈ వ్యర్థాలను సరైన పద్ధతిలో ట్రీట్ చేయడం వల్ల పునర్వినియోగానికి బాటలు వేస్తున్నారు. హైదరాబాద్లో ఇప్పటికే ఈ వ్యర్థాల కోసం ఒక స్టార్టప్ కంపెనీ పీపీపీ విధానంలో నాలుగు ప్లాంట్లను నెలకొల్పింది. ప్రతీరోజూ 2,250 టన్నుల నిర్మాణ వ్యర్థాలు ప్రాసెస్ చేసే సామర్ధ్యం వీటికుంది.ఈ విధంగా ఆయా నగరాల్లో చేపట్టిన కొన్ని చక్కని విధానాలను పరిశీలిస్తూ, అనుసరిస్తూ ముందుకు వెళితే నగరాలు శ్వాసించేందుకు అవకాశం ఉంటుంది. ఆ దిశగా కొన్ని అడుగులు పడుతున్నాయంటే… ఎలాంటి భయం, జంకు లేకుండా ఊపిరితిత్తుల నిండా శ్వాస పీల్చుకోవాల్సినంత విశేషమే కదా.
